నేతి బీరలో నెయ్యి ఎంత అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. తెలుగు సినిమాల్లో తెలుగు వారికున్న ప్రాధాన్యం ఎంత అన్నా అదే సమాధానం లభిస్తుంది. తెలుగులో ఎంత మంది టాలెంటెడ్ అమ్మాయిలు వున్నా టాలీవుడ్లో వారికి అవకాశాలన్నవి అందని ద్రాక్షే అవుతున్నాయి. తాజాగా మరో తెలుగమ్మాయి పరిస్థితి టాలీవుడ్లో అలాగే తయారైంది. ఇంద్రగంటి మోహన్కృష్ణ రూపొందించిన `అంతకు ముందు ఆ తరువాత` చిత్రంతో తెలుగమమాయి ఈషా రెబ్బా హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించినా ఆ స్థాయిలో మాత్రం ఈషాకు అవకాశాల్ని అందించలేకపోయింది.
బందిపోటు, అమీ తుమీ, దర్శకుడు, అ!, బ్రాండ్బాబు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాల్లో నటించినా కెరీర్ మలుపుతిరగలేదు. స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన `అరవింద సమేత..లో అవకాశం వచ్చినా అది ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో పెద్దగా ఈషా కెరీర్కు అది ఉపయోగపడలేకపోయింది. ఇక ఇక్కడ లాభం లేదనుకున్నీఈషా తమిళ, కన్నడ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
తాజాగా ఈషా బాలీవుడ్లో బంపర్ ఆఫర్ని సొంతం చేసుకున్నట్టు తెలిసింది. సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్థన్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఓ బాలీవుడ్ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించనుందని తాజా సమాచారం. ఇటీవలే మేకప్ టెస్ట్ని పూర్తి చేశారట. ఈషా నటన నచ్చడంతో టీమ్ వెంటనే ఈషాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. రాజ్సింగ్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.