మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `దృశ్యం`. మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుంది. ఇదే చిత్రానికి సీక్వెల్గా `దృశ్యం 2`ని తెరకెక్కించారు.
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సీక్వెల్లో మోహన్లాల్, మీనా జంటగా నటించగా, అన్షిబ హసన్, ఏస్తర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిఖ్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ మూవీని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
తాజాగా ఈ మూవీని హిందీలో రీమేక్ హక్కుల్ని పనోరమ స్టూడియోస్ అధినేతలు కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. `దృశ్యం` చిత్రాన్ని కుమార్ మంగత్ పాథక్, అభిషేక్ పాథక్ లతో కలిసి వయాకమ్ 18 మోషన్ పిక్చర్స్ అజిత్ అంధారే నిర్మించారు. ఈ రీమేక్కు పనోరమ స్టూడియోస్ అతన్ని పక్కన పెట్టారు. సీక్వెల్ రీమేక్ తననెలా పక్కన పెడతారంటూ వయాకమ్ 18 మోషన్ పిక్చర్స్ అజిత్ అంధారే పనోరమ స్టూడియోస్ కు లీగల్ నోటీసులు పంపడం వివాదానికి దారి తీసింది. దీంతో `దృశ్యం2` హిందీ రీమేక్ ప్రశ్నార్థకంలో పడింది.