హీరో అల్లు అర్జున్ని ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓ బాలీవుడ్ దర్శకుడు రిక్వెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఇండస్ట్రీ హిట్ `అల వైకుంఠపురములో`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్లపై అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లని సాధించడంతో పాటు బన్నీకి తొలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రాన్ని ఇటీవలే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని వీక్షించారు. తాజాగా ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో చూసిన బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా స్టార్ హీరో బన్నీని ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాబిల్, షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా, జజ్బా చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంజయ్ గుప్తా `అల వైకుంఠపురములో` చిత్రాన్ని చూసిన తరువాత సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ని పెట్టారు.
`తాజాగా ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో చూశాను. ఈ మూవీని బిగ్ స్క్రీన్పై చూడకపోతే ఆ లోటు అలాగే వుండిపోతుంది. ప్రస్తుత పరిస్థితులన్నీ కుదుటపడ్డాక ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్పై చూడాలని వుంది` అని ట్వీట్ చేశారు. దీనికి బన్నీ `ఈ సినిమా మీరు చూసినందుకు ఆనందంగా వుంది. మీకు థ్యాంక్స్` అన్నారు. వెంటనే సంజయ్ గుప్తా `బ్రదర్ మీ యాక్టింగ్కి నేను ఎలా కనెక్ట్ అయ్యానో చెప్పలేను. మీరు నన్ను నవ్వించారు. ఏడిపించారు.. మీకు నేను ఫ్యాన్గా మారిపోతున్నా. మీతో వర్క్ చేయడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నా` అంటూ రిస్లై ఇచ్చారు. దీనికి బన్నీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.