తెలుగు చిత్ర పరిశ్రమలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్టార్ సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. బండ్ల గణేష్, త్రివిక్రమ్, విజయేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్, నివేదా థామస్, పవర్స్టార్ పవన్కల్యాణ్.. ఇటీవల అనిల్ రావిపూడి కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఇందులో కొంత మంది కోలుకోగా మరి కొంత మంది కోలుకుంటున్నారు.
ఇదిలా వుంటే తాజాగా మరో దర్శకుడు రమేష్ వర్మ కరోనా బారిన పడినట్టు ప్రకటించారు. సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా రమేష్ వర్మ తనకు కోవిడ్ సోకినట్టు నిర్ధారించారు. `హలో ఎవ్రీవన్..నేను కోవిడ్ 19 పరీక్ష చేయించుకున్నాను. నాకు పాజిటివ్ అని తేలిసింది. భద్రతా చర్యల్లో భాగంగా నేను ప్రస్తుతం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి. అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించండి. సురక్షితంగా వుండండి` అని ట్వీట్ చేశారు.
రమేష్ వర్మ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా `ఖిలాడీ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయంతిలాల్ గడతో కలిసి కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ కీలక షెడ్యూల్ని ఇటలీలో పూర్తి చేశారు. రవితేజ పాల్గొనగా పలు కీలక ఘట్టాలతో పాటు ఛేజింగ్ దృశ్యాలని తెరకెక్కించారు.