కరోనా వైరస్ కారణంగా పరిస్థితుల్నీ ఒక్కసారిగా మారిపోయాయి. దీని ప్రభావం వల్ల దేశంలో వున్న కీలక రంగాలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. సినీ రంగం గురించి ఎంత చెప్పినా తక్కువే. వందల కోట్లల్లో ఈ రంగం నష్టాలని చవిచూడాల్సిన పరిస్థితి. థియేటర్లు మూసివేయడం, రిలీజ్కు సిద్ధంగా వున్న చిత్రాల పరిస్థితి, ఆ చిత్రాన్ని కోట్లు కుమ్మరించి నిర్మించిన నిర్మాతల పరిస్థితి మరీ దారుణంగా మారింది. నెలలు గడుస్తున్నా థియేటర్లు తెరిచే వాతావరణం కనిపించకపోవడంతో ఏం చేయాలో తోచక చాలా మంది నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
కొంత మంది ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోలేక ఓటీటీల్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అలా హీరో సూర్య చిత్రం `ఆకాశమే నీ హద్దురా` ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే హీరో సూర్య తాజా నిర్ణయాన్ని ప్రకటించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. సూర్య భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడమేంటని అంతా అవాక్కవుతున్నారు. చిత్రం కరోనా ప్రభావం భారీగానే పడింది.
అక్టోబర్ 30న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కాబోతోంది. హీరో సూర్య నిర్ణయంపై కొంత మంది హర్షం వ్యక్తం చేస్తుంటే కొంత మంది తొందరపడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకు అత్యంత సన్నిహితంగా వుండే దర్శకుడు హరి రాసిన లెటర్ ఆసక్తికరంగా మారింది. `ఆకాశమే నీ హద్దురా` చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయాలన్న నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించుకోవాలని దర్శకుడు హరి తన లేఖలో కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇద్దరం కలిసి చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాం. ఓ అభిమానిగా మీ చిత్రాల్ని థియేటర్లలో చూడటానికే ఇష్టపడతాను. ఓటీటీల్లో చూడటానికి ఇష్టపడను. థియేటర్లలో మన చిత్రాలకు ప్రేక్షకుల ప్రతిస్పందన, అభిమానాన్ని చూశాం. మనం ఈ రోజు ఈ స్టేజ్లో వున్నామంటే అదే కారణం. ఆ విషయాన్ని మనం ఎన్నటికీ మర్చిపోవద్దు` అని హీరో సూర్యకు దర్శకుడు హరి రాసిన లెటర్ చర్చనీయాంశంగా మారింది.