ఈ సంక్రాంతికి జరుగుతున్నట్లుగా హడావిడి ఏ సంక్రాంతికి కూడా జరగలేదు. ఎప్పట్లానే విడుదలకు రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నా ఈసారి ఎందుకో స్నేహపూర్వక పోటీ అయితే ఏర్పడలేదు. మొదటినుండి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉన్నాయ్. ముందుగా ఈ రెండు చిత్రాలు జనవరి 12న విడుదలకు సన్నాహాలు చేసుకోవడం దగ్గరనుండి నిర్మాతల మండలి రంగంలోకి దిగి రిలీజ్ డేట్ ను మార్చడం వరకూ ఒక థ్రిల్లర్ మాదిరి కథగా మారింది. ట్రేడ్ వర్గాలకు ఈ రెండు చిత్రాలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి. ఆఖరకు జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. అయితే ఎక్కడ నుండి వచ్చిందో తెలీదు కానీ మొత్తానికి కొత్త పుకారు ఒకటి మొదలైంది.
అదే అల వైకుంఠపురములో చిత్రం జనవరి 10న రిలీజ్ కు సిద్ధపడడం. అలా అయితే సంక్రాంతి అడ్వాంటేజ్ ను ఫుల్లుగా వాడుకోవచ్చని భావించి ఆ రకంగా అల్లు అర్జున్ నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నాడన్నది ఈ పుకారు. అయితే ఇది చూసి సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు కూడా తాము కూడా 10న వద్దామని ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు విన్న ట్రేడ్ వర్గాలు, బయ్యర్లు మాములు షాక్ కు గురవ్వలేదు.
రెండు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో ఇంత తకరారు నడుస్తుండడం నిజంగా మంచి పరిణామం కాదు. అయితే ఇది చెడు సిగ్నల్స్ పంపిస్తుంది అన్న ఉద్దేశంతో అగ్ర నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడని సమాచారం. అసలు అంతా సవ్యంగా ఉందన్న సమయంలో ఈ సమస్య ఎక్కడినుండి వచ్చిందోనని అక్కడి నుండి సమస్యపై ఆరా తీయడం మొదలుపెట్టినట్లు సమాచారం. దిల్ రాజు రంగంలోకి దిగాడంటే ఇక సమస్య సాల్వ్ అయినట్లేనని బయ్యర్లు ఇప్పుడు ధీమాగా ఉన్నారు. ఏదేమైనా శనివారం ఈ విషయంపై క్లారిటీ రావొచ్చు. ప్రస్తుతానికైతే రజినీకాంత్ దర్బార్ జనవరి 9న, సరిలేరు నీకెవ్వరు జనవరి 11న, అల వైకుంఠపురములో జనవరి 12న, ఎంత మంచివాడవురా జనవరి 15న విడుదలవుతాయని అనుకోవచ్చు.