అగ్ర నిర్మాత దిల్ రాజు ఈరోజు వివాహం చేసుకోబోతున్నారు. మూడేళ్ల క్రితం తన భార్య అనితను కోల్పోయిన దగ్గరనుండి దిల్ రాజు ఒంటరిగానే జీవిస్తున్న సంగతి తెల్సిందే. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎప్పటినుండో మరో వివాహానికై ఒత్తిడి తెస్తున్నా వాయిదా వేస్తూ వెళ్లిన దిల్ రాజు చివరికి ఇప్పుడు ఓకే చెప్పారు. ఈరోజు సాయంత్రం తన స్వస్థలం నిజామాబాద్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో దిల్ రాజు వివాహం జరగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పెళ్ళికి కేవలం 10 మంది మాత్రమే హాజరు కానున్నారు. దిల్ రాజు పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అటు వృత్తి పరంగా, ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా ప్రస్తుతం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాను. కరోనా కారణంగా వృత్తిపరంగా పనులన్నీ నిలిచిపోయాయి. అయితే ఈ కష్టాలన్నీ త్వరలోనే దూరమవుతాయన్న నమ్మకం ఉంది. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాను. అంతా ఆనందంగా ఉంటుందని నమ్ముతున్నాను అని తెలిపాడు దిల్ రాజు.
దిల్ రాజు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఇక వృత్తిపరంగా వి సినిమా విడుదల వాయిదా పడింది. థియేటర్లు ఓపెన్ చేయగానే ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నాడు దిల్ రాజు. ఇంకా పలు ప్రాజెక్ట్ లు నిర్మాణ దశలో ఉన్నాయి.