వరుస చిత్రాల్ని నిర్మిస్తూ యమ బిజీగా వున్నారు దిల్ రాజు. మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో చేయాలనుకున్న భారీ చిత్రం స్టోరీ కారణంగా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్న వేళ దిల్ రాజు ఓ క్రేజీ కాంబినేషన్ని సెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పవర్స్టార్ పవన్కల్యాణ్తో హిందీ హిట్ చిత్రం `పింక్`ని తెలుగులో బోనీ కపూర్తో కలిసి రీమేక్ చేస్తున్న దిల్ రాజు తరువాత చిత్రాన్ని కూడా మెగా హీరోతో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇటీవల బాలీవుడ్ హిట్ చిత్రం `బద్లా`ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి అడివి శేష్ హీరోగా పీవీపీ సంస్థ `ఎవరు` పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. రెజీనా కసాండ్ర హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ద్వారా రామ్జీ దర్శకుడిగా పరిచయమయ్యారు. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి ఊహించని లాభాల్ని తెచ్చిపెట్టింది.
ఈ చిత్ర దర్శకుడు రామ్జీ ఓ మల్టీస్టారర్ కథని ఇటీవల నిర్మాత దిల్ రాజుకు వినిపించారట. కథ కొత్తగా వుండటంతో సినిమా చేద్దామని గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్రంలో మెగా హీరోలు వరుణ్తేజ్, సాయిధరమ్తేజ్ నటించే అవకాశం వుందని, ఇప్పటికే దిల్ రాజు వారితో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపినట్టు తెలిసింది. సాయిధరమ్తేజ్ `సోలో బ్రతుకే సోబెటర్` చిత్రంతో బిజీగా వున్నాడు. వరుణ్తేజ్ ఇటీవలే తన కొత్త చిత్రం `బాక్సర్`రెగ్యుల్ షూటింగ్ని వైజాగ్లో మొదలుపెట్టాడు. ఈ ఇద్దరు ఫ్రీ అయిన తరువాతే మెగా మల్టీస్టారర్ని తెరపైకి తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.