ఈ ఏడాది ఆరంభంలో వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి చేసిన ఎఫ్ 2 ఎంత పెద్ద విజయం సాధించిందో అందరం చూసాం. ఆ చిత్రానికి నిర్మాత అయిన దిల్ రాజు అప్పట్లో భారీ లాభాలను వెనకేసుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ వాల్మీకి చిత్రం విడుదలకు రెడీగా ఉంది. అప్పుడు వరుణ్ కి హీరో అయిన దిల్ రాజు, ఇప్పుడు విలన్ గా మారాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
వాల్మీకి చిత్రానికి పోటీగా రేపే సూర్య నటించిన బందోబస్త్ చిత్రం విడుదలవుతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి తెలుగులో మినిమం హైప్ లేదు. అసలు ఇలాంటి సినిమా ఒకటి వస్తోందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. ఇక్కడి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా సాదాసీదాగా నిర్వహించారు. ఇలాంటి బజ్ లేని సినిమాని నైజాంలో పంపిణీ చేస్తోన్న దిల్ రాజు బెస్ట్ థియేటర్లను కేటాయించుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. వాల్మీకి చిత్రానికి సెకండ్ ప్రిఫెరెన్స్ ఇస్తున్నారని, ఇది చాలా అన్యాయమని పలువురు అభిప్రాయపడ్డారు.
అయితే ఇప్పుడు ఈ వార్త ఒట్టి పుకారేనని తేలిపోయింది. కొద్దిసేపటి క్రితం హరీష్ శంకర్ ట్విట్టర్ లో నైజాంలో వాల్మీకి చిత్రానికి తగినన్ని థియేటర్లు కేటాయించనందుకు ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను అని పోస్ట్ చేసాడు. తెలుగు సినిమా ఎదుగుదల కోసం తాను పంపిణీ చేసే సినిమా థియేటర్ల సంఖ్యను తగ్గించుకున్నందుకు దిల్ రాజును అందరూ ప్రశంసిస్తున్నారు.
Thank you SVC films and my beloved Sirish Anna for accommodating deserved screens in Nizam …… love you Anna I always owe u 🙂 pic.twitter.com/oXL4AIgwuN
— Harish Shankar .S (@harish2you) September 19, 2019
Credit: Twitter