సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం దర్బార్ ఈ సంక్రాంతికి జనవరి 9న విడుదల కానున్న విషయం తెల్సిందే. గత కొన్ని సినిమాలు ప్లాప్ అయిన కారణంగా రజినీకాంత్ కు ఈ చిత్రం హిట్ అవ్వడం చాలా ముఖ్యం. దర్బార్ సినిమాకు అన్నీ పాజిటివ్ గా ఉండడం కలిసొచ్చే అంశం. ముంబై సిటీ కమిషనర్ గా నటిస్తోన్న రజినీకాంత్ ఈ చిత్రంలో చాలా స్టైల్ గా ఉన్నాడు. దర్శకుడు మురుగదాస్ రజినీ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలను ఈ చిత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. తెలుగులో రెండు భారీ చిత్రాలు విడుదలవుతున్న సమయంలో దర్బార్ కూడా వస్తోంది. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న వస్తుండగా, జనవరి 12న అల వైకుంఠపురములో రిలీజ్ అవుతోంది. అంటే దర్బార్ కు రెండు రోజులు ఉన్నాయ్. ఈ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తే అంత. దాదాపు 14 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దర్బార్.
ఈ రెండు రోజుల్లో దాదాపు అన్ని థియేటర్లలో దర్బార్ దర్శనమివ్వనుంది. ప్రతిరోజూ పండగే, వెంకీ మామల తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో దర్బార్ సినిమా ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయస్ కానుంది. అయితే మొదటి రెండు రోజులు సినిమాకు కలిసొచ్చేలా ఉన్నా, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు విడుదలయ్యాక దర్బార్ ప్రదర్శన ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. ఈ రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాక కూడా సినిమాకు కలిసిరావాలంటే మౌత్ టాక్ చాలా బాగుండాలి. అప్పుడే దర్బార్ రెండు భారీ చిత్రాల మధ్య నిలబడగలుగుతుంది.
దర్బార్ ముందున్న అసలైన సవాల్ ఇదే. మురుగదాస్ తన సినిమాల్లో హీరో ఎవరైనా తన స్టైల్ కు అనుగుణంగా మార్చేసుకుంటాడు. కానీ ఈసారి తన స్టైల్ కు భిన్నంగా రజినీకాంత్ మ్యానరిజానికి అనుగుణంగా సినిమాను తీసాడనిపిస్తోంది. ఈ లెక్కన దర్బార్ సినిమా ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుంది అన్నది చూడాలి.