ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో నివాసం ఉంటున్న నవ్వాడ శోభారాణి అనే ఓ మహిళ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్, అతని కుమారుడు తనపై దౌర్జన్యం చేశారని, తన బిల్డింగ్కు అద్దె చెల్లించకుండా వేధిస్తున్నారని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
2018 లో మినిస్టర్ క్వార్టర్స్కు ఎదురుగా వున్న బిల్డింగ్ను నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అద్దెకు తీసుకున్నారు. ఇందులోనే తెలంగాణ ఫిల్మ్ కల్చరల్ సెంటర్ (టిఎఫ్సీసీ) ని ఏర్పాటు చేశారు. ఇందు కోసం నెలకు నాలుగున్నర లక్షలు అద్దె చెల్లిస్తానని, అడ్వాన్స్గా 40 లక్షలు ఇస్తానని మాటిచ్చారట. కానీ 30 లక్షలు మాత్రమే అడ్వాన్స్ చెల్లించి అద్దె మాత్రం చెల్లించడం లేదని, అడిగితే వేధింపులకు గురిచేస్తున్నాడని నవ్వాడ శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలా వుంటే ప్రతాని రామకృష్ణ గౌడ్ పది రోజుల క్రితమే తాను అద్దె చెల్లించలేనని, బిల్డింగ్ తాళాలు అప్పగించారని తెలిసింది. అయితే అతని కుమారుడు మాత్రం దౌర్జన్యం చేశాడని, బెదిరింపులకు దిగాడని సదరు బిల్డింగ్ ఓనర్ నవ్వాడ శోభారాణి వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.