కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ( 77) అనారోగ్యంతో కన్నుమూశారు . గతకొంత కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైపాల్ రెడ్డి ఈరోజు తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు . జైపాల్ రెడ్డి మరణ వార్త తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు నెలకొన్నాయి . జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని జూబ్లీ హిల్స్ లోని స్వగృహానికి తరలించారు .
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని మాడుగులలో 1942 జనవరి 16 న జన్మించారు జైపాల్ రెడ్డి . 1969 లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుండి అసెంబ్లీ కి పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టాడు . వరుసగా నాలుగుసార్లు కల్వకుర్తి నుండే పోటీ చేసి విజయం సాధించిన జైపాల్ రెడ్డి 1984 లో పార్లమెంట్ కు పోటీ చేసాడు . అసెంబ్లీ కి నాలుగుసార్లు , అయిదుసార్లు పార్లమెంట్ కు పోటీ చేసి విజయాలు అందుకున్న జైపాల్ రెడ్డి రెండుసార్లు కేంద్ర మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాడు . కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన జైపాల్ రెడ్డి జనతాదళ్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదగడం విశేషం . జైపాల్ రెడ్డి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .