ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు గొల్లపూడి మారుతీరావు గురువారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా గొల్లపూడి మారుతీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గొల్లపూడి మారుతీరావుతో తనది గురుశిష్యుల అనుబంధమని తెలిపారు. ఆ మధ్య గొల్లపూడి తన కుమారుడి పేరు మీద నిర్వహిస్తున్న అవార్డుల వేడుకకు వెళ్లానని, ఆ తరువాత ఆయనను కలిసే అవకాశం తనకు తక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గొల్లపూడి చాలా ఆరోగ్యంగా వుండేవారని, అలాంటి వ్యక్తి ఇంతలోనే ఇలా అవుతుందని ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు. 1979లో `ఐలవ్యూ` అనే సినిమా చేస్తున్న సందర్భంలో నిర్మాత భావన్నారాయణ తనకు గొల్లపూడిని పరిచయం చేశారని, అప్పటికే ఆయన పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టు అని, సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారని, ఆయన దగ్గర డైలాగ్లు నేర్చుకోమని తనని పంపించేవారని, సరదాగా జరిగిన మా పరిచయం తరువాత స్నేహంగా మారిందని గుర్తు చేసుకున్నారు.
ఖాలీగా వున్న సమయాల్లో తరచూ గొల్లపూడి ఇంటికి వెళుతుండేవాడినని, సాహిత్యం గురించి, రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన వల్లే తనకు కలిగిందని చెప్పుకొచ్చారు. `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` సినిమా చేయాలనుకున్నప్పుడు అందులోని ఓ షాడిజం క్యారెక్టర్కు గొల్లపూడి అయితేనే బాగుంటుందని భావించామని, ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తుచేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడే వారని, అలాంటి సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఎక్కడ వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.