మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. ఆగష్ట్ 30న శుక్రవారం సాయంత్రం ఆయన సైరా చిత్రం వర్క్ మీద ముంబై వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దాంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని అత్యవసరంగా వెనుకకు మళ్లించడంతో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
చిరంజీవితోపాటు విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు.. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముంబై వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సాయంత్రం విస్తారా ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించారు.
ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే వెనుకు మళ్లించి ముంబై ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పుకొన్న ప్రయాణికులకు మరో అసౌకర్యం కలిగినట్టు తెలిసింది. విమానం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు మరో విమానం కోసం గంటలపాటు పడిగాపులు పడ్డట్టు సమాచారం.
అనంతరం మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను హైదరాబాద్కు పంపించినట్టు తెలిసింది. ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ప్రమాద ఘటన బయటకు వచ్చింది. చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో దాదాపు 120 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని వెనుకకు మళ్లిస్తున్నట్టు తెలియగానే ప్రయాణికులు ఆందోళనకు లోనైనట్టు తెలిసింది. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అర్ధగంట సేపు భయాందోళనలకు లోనైనట్టు సమాచారం. పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి సేఫ్గా ల్యాండ్ చేయడంతో ఆందోళన నుంచి బయటపడినట్టు సమాచారం. .!!