ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదు కానీ సినీ రంగంలో మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లైఫ్ స్టైల్స్నే మార్చేస్తుంది. గత కొంత కాలంగా హిట్ సినిమా కోసం ఎదురుచూసిన పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ హిట్తో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. దీంతో ఆయనతో కలిసి సినిమాలు నిర్మించే చార్మి లైఫ్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా `ఫైటర్` పేరుతో తెలుగు, హిందీ భాషల్లో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ఇటీవల ముంబైలో స్టార్ట్ అయింది. తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. త్వరలో తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ప్రారంభానికి ముందే పూరి, చార్మి ముంబైలో అత్యధునిక సదుపాయాలతో ఓ లావిష్ ఆఫీస్ని కొనేశారు. దీంట్లో వున్న వసతులు చూసి వర్మ లాంటి వాడే ట్వీట్ చేయడం విశేషం.
సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ముంబై ఆఫీస్కి చార్మి తన మకాం మార్చేసింది. బిజీ షెడ్యూల్తో బిజీ బిజీగా గడిపేసిన చార్మి తాజాగా ముంబై ఆఫీస్లో ఛిల్ అవుతూ ఎంజాయ్ చేస్తోంది. స్టాఫ్ వెళ్లిపోతే పీస్ఫుల్ వాతావరణంలో ఒంటరిగా కూర్చుని వున్న స్టిల్ని చార్మి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూరి ముంబై ఆఫీస్కి `అడ్డా` అని పేరు పెట్టారు.