మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం `వెంకీమామ`. బాబి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి. సురేష్బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. ఈ 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తొలి సారి మామా అల్లుళ్లు విక్టరి వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి ఏ మాత్రం తగ్గని స్థాయిలో సినిమా వుంటుందని నాగచైతన్య చెబుతున్నారు. గురువారం సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చైతూ పలు ఆసక్తిర విషయాల్ని మీడియాతో పంచుకున్నారు.
చిన్నతనం నుంచి వెంకీ మామతో తనకున్న బాండింగ్ ఈ చిత్రానికి చాలా వుపయోగపడిందని, దాని కారణంగా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరిందని చెప్పుకొచ్చారు. వెంకీ మామ అంటే చిన్న తనం నుంచి గౌరవం, భయం వుండేవని, సెట్లో ఆయనతో కలిసిపోవడానికి వారం సమయం పట్టిందని, ఆ తరువాత మామ సహకారంతో కలిసి నటించానని వెల్లడించారు. తనతో సినిమా చేయాలని సురేష్ మామ 20కి పైగా కథలు తన వద్దకు పంపించారని అయితే అందులో ఏ కథ తనకు నచ్చలేదని, చివరికి బాబీ చెప్పిన `వెంకీమామ` స్క్రిప్ట్ తనకు బాగా నచ్చడంతో కార్యరూపం దాల్చిందని చెప్పారు.
ఆర్మీ నేపథ్యంలో తాను ఇంత వరకు ఏ సినిమా చేయలేదని, తొలి సారి ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్గా నటించానని, కాశ్మీర్లో చిత్రీకరించిన ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్గా నిలుస్తాయని చై చెప్పుకొచ్చారు. కెరీర్ తొలి నాళ్ల నుంచి సురేష్ ప్రొడక్షన్స్లో నటించాలని వుండేదని, ఆ డ్రీమ్ ఇప్పటికి ఫుల్ ఫిల్ అయిందని, ఈ సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ దర్శకుడు బాబికి, మా అంకుల్స్ కె చెందుతుందని చెప్పుకొచ్చారు.