వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డ్ గట్టి ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్ శివారులో జరిగిన దిశ అవమానవీయ కథని తీసుకుని వర్మ ‘దిశా ఎన్కౌంటర్’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మూవీని నిలిపివేయాలంటూ పలువురు ఈ చిత్రంపై కోర్టుని ఆశ్రయించారు. ఆ తరువాత ప్రాంతీయ సెన్సార్ బోర్డుని కూడా సంప్రదించారు. దీంతో ఈ సినిమాపై ప్రాంతీయ సెన్సార్ బోర్డు తీవ్రంగా స్పందించింది. ఈ చిత్ర సెన్సార్ విషయంలో చిత్ర దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ఊహించని షాక్ ఇచ్చింది.
ఇటీవల నలుగురు సభ్యుల కమిటీ ఈ చిత్రాన్ని చూసింది. సెన్సార్ సర్టిఫికెట్పై నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు 2019 డిసెంబర్లో జరిగిన నిజమైన నేరాన్ని దాదాపుగా పోలి ఉన్నాయని సెన్సార్ ప్యానెల్ అభిప్రాయపడింది. కాబట్టి సెన్సార్ కమిటీ ‘దిశా ఎన్కౌంటర్’ కు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో షాక్ అయిన డైరెక్టర్ ఆర్జివి రివిజన్ కమిటీని సంప్రదించారు.
సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు ఈ చిత్రంపై రివిజన్ కమిటీ కూడా పునరాలోచించవచ్చు. ‘దిశా ఎన్కౌంటర్’ నిజమైన సంఘటనల మీద ఆధారపడి ఉందని, దిశా తల్లిదండ్రులు దాఖలు చేసిన కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రివిజన్ కమిటీ నిర్ణయం కీలకంగా మారబోతోంది.