సీక్వెల్ చిత్రాలు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్లకి సీక్వెల్స్ని తీసే పనిలో మేకర్స్ బిజీ అయిపోతున్నారు. బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న యష్రాజ్ ఫిల్మ్స్ 2005లో అభిషేక్ బచ్చన్, రాణిముఖర్జీల కలయికలో `బంటీ ఔర్ బబ్లీ` చిత్రాన్ని నిర్మించింది. షాద్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్లపై చిత్రీకరించిన `కజ్ రారే కజ్ రారే.. సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గానే మిగిలిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ని చేయబోతున్నారు.
ఈ విషయాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. `బంటీ ఔర్ బబ్లీ 2` పేరుతో సెట్స్పైకి రానున్న ఈ చిత్రంలో `గల్లీబాయ్` చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సిద్ధాంత్ చతుర్వేది ఈ సినిమాతో హీరోగా, ముంబై గాళ్ శర్వారీ హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. దాదాపు 14 ఏళ్ల విరామం తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. సుల్తాన్, టైగర్ జిందాహై చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన వరుణ్శర్మని ఈ చిత్రం ద్వారా ఆదిత్య చోప్రా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.