టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాల జోరు ఊపందుకుంది. మునుపెన్నడూ లేని విధంగా స్టార్ హీరోలు మల్టీస్టారర్ చిత్రాలకు సై అంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రేరణతో ఇటీవల పవర్స్టార్ పవన్కల్యాణ్, దగ్గుబాటి రానాల కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ మొదలైంది.
మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ సోమవారం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. ఇదిలా వుంటే మరో క్రేజీ కాంబోలో మరో భారీ మల్టీస్టారర్ తెరపైకి రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ చిత్రానికి `యాత్ర` ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహించనున్నారని,
ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నారని ఇన్ సైడ్ టాక్. బన్నీ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ `లైగర్`లో నటిస్తున్నారు.