మరో వీకెండ్ ముగిసింది. ఇది 2019కి ఆఖరి వీకెండ్ కావడంతో ట్రేడ్ పండితులు ఈ వీకెండ్ పై ఆసక్తి ప్రదర్శించారు. అయితే సినిమాల ప్రదర్శనలో ఎటువంటి సర్ప్రైజ్ లు లేవు. సినిమాలు అన్నీ వాటి ప్రదర్శనలు అనుగుణంగానే కొనసాగాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే మరో వీకెండ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసింది. ఈ వీకెండ్ కూడా అదే విన్నర్ గా నిలిచింది. రెండో వీకెండ్ లో కూడా మంచి నంబర్స్ పోస్ట్ చేసి శభాష్ అనిపించుకుంది. ఇప్పటికే ప్రతిరోజూ పండగే 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగలిగింది. బయ్యర్లు అందరూ తొలి వీక్ కే బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడంతో వచ్చే లాభాలతో పండగ చేసుకుంటున్నారు. యూఎస్ లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఇప్పటికే అర మిలియన్ సాధించింది. మరో వారం ఈ సినిమాకు రన్ ఉండనుంది. ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక్కడ 100K డాలర్లు వసూలు చేసింది ప్రతిరోజూ పండగే.
వెంకీ మామ మూడో వీకెండ్ కు బాగా నెమ్మదించేసింది. అయితే ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవడంతో బయ్యర్లకు కూడా పెద్దగా కంప్లైంట్స్ లేవు. నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమా కథ కంచికి చేరినట్లే. ఈ సినిమాను డిజాస్టర్ ఖాతాలో వేసేయొచ్చు.
ఇక కొత్త సినిమాలు మత్తు వదలరా, ఇద్దరి లోకం ఒకటే రెండిటికీ వ్యత్యాసం ఉంది. మత్తు వదలరాకు క్రిటిక్స్ మంచి రేటింగ్స్ ఇచ్చారు. రాజమౌళి అండ్ కో సపోర్ట్ చేసారు. ఇంకా ఇండస్ట్రీ పెద్దల బ్యాకింగ్ కూడా ఉంది. అయినా కూడా మత్తు వదలరా అద్భుతంగా ఏం ఆడట్లేదు. 5 రోజులకు ఈ సినిమా 1.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇందులో నైజాం నుండి వచ్చిన వసూళ్లే 65 లక్షల దాకా ఉన్నాయి. అయితే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కడంతో బయ్యర్లు నష్టపోయేది ఏముండదు.
ఇక రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అడ్రెస్ లేకుండా పోయింది. ఈ సినిమాను ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. రాజ్ తరుణ్ వంటి పేరున్న హీరో చేసిన సినిమా 5 రోజులకు కనీసం కోటి కూడా వసూలు చేయకపోవడం నిజంగా దారుణమే.