బిగ్బాస్ సీజన్ 4 విపత్కర పరిస్థితుల్లో మొదలైనా ఎక్కడా ఎలాంటి బ్రేక్ లేకుండా విజయవంతంగా పూర్తయింది. బుల్లితెర వీక్షకులని 106 రోజుల పాటు ఎంటర్టైన్ చేసిన క్రేజీ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఆదివారం అట్టహాసంగా ముగిసింది. టాప్ 5 కంటెస్టెంట్లలో నిలిచిన అభిజీత్ చివరికి టైటిల్ని దక్కించుకుని విజయం సాధించాడు. టాస్క్లు మాత్రమే కొలమానం కాదని, వ్యక్తిత్వం కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుందని అభిజీత్ విజేతగా నిలవడంతో బిగ్ బాస్ మరోసారి రుజువు చేశారు.
గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న గ్రాండ్ ఫినాలేలో అభిజీత్ ఫైనల్ విజేతగా నిలుస్తాడని సోషల్ మీడియా వేదికగా సామాన్యుల నుంచి స్టార్స్ వరకు జోష్యం చెప్పారు. ఆదివారం రాత్రి అదే నిజమైంది. అతక్యధిక సంఖ్యలో అమ్మాయిలు అభిజీత్ విజయంలో కీతక పాత్ర పోషించారట. అభితో చివరి వరకు పోటీపడిన సోహైల్ బిగ్బాస్ ఇచ్చిన 25 లక్షల ఆఫర్తో పోటీ నుంచి తప్పుకోగా అఖిల్ చివరికి రన్నరప్గా నిలిచాడు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి విన్నర్ అభిజీత్కి బిగ్బాస్ ట్రోఫీని అందించి అతనిపై ప్రశంసలు కురిపించడం విశేషం.
అంతకు ముందు షోలో ఇంటి సభ్యులతో ముచ్చటించిన తీరు పలువురిని ఆకట్టుకున్నాయి. ఇంటి సభ్యులు ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. సోహైల్ తను తీసుకున్న 25 లక్షల్లో 10 లక్షలు ఆర్ఫనేజ్కి అందింస్తానని మాటిచ్చి మరీ పోటీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఆ 10 లక్షలు తానిస్తానంటే తానిస్తానని చిరు , నాగ్ ప్రకటించారు. చిరంజీవి ఓ అడుగు ముందుకేసి వేదికమీదే మెహబూబ్కి చెక్ రాసి ఇవ్వడంతో ఈవెంట్ జరుగుతున్న హౌస్ ప్రేక్షకులు, బిగ్బాస్ కంటెస్టెంట్ల హర్షద్వానాలతో మారుమ్రోగింది. ప్రణీత, అనిల్రావిపూడి, మెహరీన్, లక్ష్మీరాయ్ గ్రాండ్ ఫినాలేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.