రజనీకాంత్ స్థానికతపై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు వెటరన్ దర్శకుడు భారతీరాజా. రొమాంటిక్ ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన గత కొంత కాలంగా రజనీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మధ్య రజనీ రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ ఓ సమావేశాన్ని నిర్వహిస్తే దానిపై ఘాటుగా స్పందించి వార్తల్లో నిలిచారు. రాజకీయాల్లోకి రావడం కాదు. అసలు రజనీ తమిళుడే కాదని ఆయన స్థానికతపైసంచలన వ్యాఖ్యలు చేయడం తమిళ చిత్ర సీమలో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా మరోసారి రజనీపై భారతీరాజా విరుచుకుపడ్డారు. ఇటీవల ఇటీవల రజనీకాంత్ నటించిన `దర్బార్` చిత్రం జనవరి 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుందని, వంద కోట్ల మార్కుని దాటి వసూళ్ల వర్షం కురిపిస్తోందంటూ ప్రచారం జరిగింది.
అయితే బయ్యర్స్ మాత్రం నష్టాలొచ్చాయని రజనీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఈ వివాదంపై భారతీరాజా మండిపడ్డారు. 50 కోట్లతో నిర్మించిన చిత్రానికి 400 కోట్లు ఎలా వచ్చాయని, అలా వస్తే మరి 350 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన ఎద్దేవా చేశారు. డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనే ముందు ఆలోచించాలని, గుడ్డిగా అడిగినంత ఇచ్చేస్తే ఇలాగే వుంటుందని చురకలంటించడం ఆసక్తికరంగా మారింది.