తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో హైదరాబాద్లో వుంటున్న వాళ్లల్లో అత్యధికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లాక్డౌన్ సడలించిన తరువాత హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కరోనా ప్రమాద స్థాయిని దాటుతూ అంత కంతకూ పెరిగిపోతోంది.
దీనిపై సూపర్స్టార్ మహేష్ తాజాగా స్పందించారు. `లాక్డౌన్ సడలించినందున కేసులు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మనల్ని, మన చుట్టుపక్కల ప్రజలను మనం రక్షించుకునే సమయం ఇది. బయటికి వచ్చేటప్పుడు ఎప్పుడూ మాస్కు ధరించాలి. మీ పరిసరాల గురించి తెలుసుకోండి. సామాజిక దూరాన్ని పాటించండి. అన్ని రకాల భద్రతా చర్యల్ని అనుసరించండి. ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది కరోనా వైరస్ సోకిన వారిని ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది. అలాగే కరోనా సోకిన వారు మీ దరిదాపుల్లో వున్నట్టయితే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆరోగ్య రక్షణ, అత్యవసర సేవల ప్రాముఖ్యతను సులభతరం చేస్తుంది. అందరూ సురక్షితంగా ఉండండి, మరింత బాధ్యతగా వుండండి!` అని మహేష్ ఇన్ స్టా వేదికగా స్పందించారు.
మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం భారీ స్థాయిలో బ్యాంక్ సెట్ని మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాతే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాలని మహేష్ భావిస్తున్నారు.