నందమూరి బాలకృష్ణ కొన్నేల క్రితం దర్శకుడిగా చేసిన ప్రయత్నం `నర్తనశాల`. డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రారంభమై కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. బాలకృష్ణ సౌందర్య, శ్రీహరి, శరత్బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఆ తరువాత సౌందర్య అకాల మరణం.. ఆ తరువాత జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆగిపోయింది.
దీంతో ఈ చిత్రాన్ని మళ్లీ తిరిగి మొదలుపెట్టలేక బాలయ్య ఆపేశారు. చిత్రీకరించిన సన్నివేశాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తే బాగుండేదని అభిమానులు.. ప్రేక్షకులు ఆశగా ఎదురుచూశారు. కానీ అది జరక్క పోవడంతో కనీసం ఆ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలైనా చూడాలనుకున్నారు. ఆ కోరికని గమనించిన బాలకృష్ణ `నర్తనశాల`కు సంబంధించిన 17 నిమిషాల నిడివిగల సన్నివేశాలని ఈ 24న NBK Theatre లో శ్రేయాస్ ఈటీ ద్వారా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే దీనికి టిక్కెట్ ఎంత కోట్ చేశారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. భారీగా కోట్ చేయడం ఇష్టం లేని బాలకృష్ణ కేవలం 50 రూపాయలు మాత్రమే టిక్కెట్గా ఖరారు చేసినట్టు తెలిసింది. దీని ద్వారా వచ్చే మొత్తంలో కొంత భాగాన్ని చారిటీకి ఖర్చు చేయబోతున్నామని ఇటీవలే వెల్లడించారు.