ఈ సినిమా వాళ్ళు ఒక్కోసారి అస్సలు అర్ధం కారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు, అంతలోనే మళ్ళీ దగ్గరైపోతారు. మళ్ళీ ఎప్పటికో గాని ఒకరి గురించి ఒకరు మాట్లాడరు. కొన్ని నెలల క్రితం ఎన్నికల సందర్భంగా మెగా – నందమూరి ఫ్యామిలీల మధ్య కొంచెం దూరం పెరిగిన సంగతి తెల్సిందే. బాలకృష్ణ, చిరంజీవిని అనడం, దానికి ప్రతిగా నాగబాబు, బాలకృష్ణపై డైరెక్ట్ గానే సెటైర్ లు వేయడం, పవన్ కళ్యాణ్ రాజకీయ కోణంలో విమర్శలు చేయడం వంటివి చూసాం.
ఇంత జరిగాక మెగా, నందమూరి ఫ్యామిలీలు మళ్ళీ కలుస్తాయని ఎవరూ అనుకోలేదు. అయితే సినిమానే వారిని మళ్ళీ కలిసేలా చేసింది. ఇటీవలే సైరా నరసింహారెడ్డి అద్భుత విజయాన్ని సాధించిన సందర్భంగా పురస్కరించుకుని కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి సైరా సక్సెస్ పార్టీని నిర్వహించారు. దీనికి సైరా టీమ్ తో పాటు నందమూరి బాలకృష్ణ, కృష్ణం రాజు, వెంకటేష్, మురళి మోహన్ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పార్టీలో బాలకృష్ణ చేసిన హడావుడి గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
సైరా సాధించిన విజయంతో హ్యాపీగా ఉన్న చిరంజీవిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడమే కాదు, సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడట బాలకృష్ణ. ఈ సందర్భంగా సైరా టీమ్ మొత్తాన్ని బాలకృష్ణ ప్రశంసలతో ముంచెత్తాడు. ఏదేమైనా సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. చిరంజీవి సాధించిన విజయాన్ని తమ విజయమే అన్నట్లు ఆస్వాదించడం అందరినీ ఆకట్టుకుంది.