అనురాగ్ కొణిదెన, అవికా గోర్ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సత్యం ద్వారపూడి దర్శకత్వం వహిస్తున్నారు. జెమిని ఎఫ్ ఎక్స్ సమర్పణలో క్రిషి క్రియేషన్స్ బ్యానర్పై కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ బుధవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరోయిన్ అవికా గోర్ కూడా ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తోంది.
పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా జెమినీ ఎఫ్ ఎక్స్ పీవీ మూర్తి మాట్లాడుతూ `జెమినీ సంస్థ నుంచి కొత్త ప్రతిభను ప్రోత్సహించాలన్న ఆలోచనలో భాగంగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నేటితరం నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహిస్తూ కంటెంట్ వున్న సినిమాల్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. కన్నడలో హిట్టయిన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాం`అన్నారు.
నిర్మాణ సంస్థని ప్రారంభించి నిర్మాతగా జెనిమితో కలిసి సినిమా నిర్మించడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. కామెడీ లవ్ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే పంధాలో రూపొందుతున్న చిత్రమిది` అని అవికా గోర్ తెలిపింది. మార్చి 4 నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభిస్తాం. జూన్ 7న రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఆగస్టులో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని దర్శకుడు తెలిపారు.