
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం ఓవైపు సీఎం గెహ్లాట్ నామినేషన్ వేసేందుకు రెడీ అవుతుండగా.., మరోవైపు ముఖ్యమంత్రిగా గెహ్లాటే కొనసాగాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలెట్ను ఒప్పుకునేదే లేదంటూ ఎమ్మెల్యేలు రెబల్ జెండా ఎగురవేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల్ని గెహ్లాట్ చేపడితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించేందుకు నిన్న సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు.
కానీ ఆ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అర్ధరాత్రి వరకూ హైడ్రామా కొనసాగింది. ఈనేపధ్యంలో కాంగ్రెస్లో అనిశ్చితికి తాత్కాలిక తెర దింపింది హై కమాండ్. అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరకు యథాస్థితి కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. దీంతో అక్టోబర్ 18న తదుపరి సీఎల్పీ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు గెహ్లాట్, సచిన్ వర్గాలను సోనియా ఢిల్లీకి పిలిచనట్టు సమాచారం. రాజస్థాన్ సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అధిష్ఠానం పరిశీలకులుగా జైపుర్కు వచ్చిన మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్.. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్రం చేస్తున్నారు. అయితే గెహ్లాట్ వర్గం అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశంతో గెహ్లాట్కు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు 92 మంది ఎమ్మెల్యేలు సిద్ధపడ్డారు. స్పీకర్కి రాజీనామాలు సమర్పించారు. అయితే రాజీనామాలపై స్పీకర్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.