
అర్హులైన ప్రతి ఒకరికీ ఆసరా పింఛన్ అందజేస్తామని అన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీపై బుధవారం హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 1.96 లక్షల మంది ప్రతినెలా ఆసరా పింఛన్లు పొందుతున్నారని, నెలకు రూ.42.22 కోట్లు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం నూతనంగా 77,695 మందికి పింఛన్లను మంజూరు చేసిందని వివరించారు. కొత్తగా మంజూరైన వారికి నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, గుర్తింపు కార్డులను అందజేయాలని సూచించారు. ఎమ్మెల్యేల సహకారంతో ఈ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి పింఛన్లు మంజూరు కాలేదంటూ పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో ప్రస్తావించగా, అర్హులైన వారందరికీ పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ప్రభాకర్రావు, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, సాయన్న, కౌసర్ మొహినుద్దీన్, బలాల, మౌజం హుస్సేన్, కలెక్టర్ అమయ్ కుమార్, ఆర్డీవోలు వసంత, వెంకటేశ్వర్లు, పలువురు తాసీల్దార్లు పాల్గొన్నారు.