యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ దీని ధాటికి భీతిల్లిపోతున్నాయి. ఎక్కడ ఏ దేశం గురించి విన్నా కరోనా మరణాలే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఇండియాలో చాపకింద నీరులా రోజు రోజుకీ విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 2 లక్షల మైలు రాయిని దాటేసింది. దీన్ని ఎలాగైనా అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయినా దీని విజృంభన ఆగడం లేదు.
కరోనాపై పోరులో డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ముందు వరుసలో నిలుచున్నారు. ప్రాణాలని సైతం లెక్కచేయక శ్రమిస్తున్నారు. వీరిపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీరికి సంఘీభావం తెలుపుతూ ఓ పాటని రూపొందించి అంకితం చేసింది. `సమరం.. సమరం.. విధితో సమరం..` అంటూ సాగిన ఈ పాటలో క్రేజీ స్టార్స్ కాజల్ అగర్వాల్, హీరో నిఖిల్, ప్రణీత ప్రధమంగా నిలిచారు. ఆ తరువాత పీవీ సింధూ, ద్రోణవల్లి హారిక, పాయల్ రాజ్పుత్, సుధీర్బాబు, నిధి అగర్వాల్ నిలిచారు.
ఈ పాటలో చైనా నుంచి వైరస్ బయటపడటం, అనంతరం అది ప్రపంచం మొత్తం విస్తరించడం, లాక్డౌన్ అమల్లోకి రావడం వంటి విషయాలని చూపించారు. కరోనాపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటం, వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ ఘటన, వలస కార్మికులు పడుతున్న కష్టాలని చూపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీన్ని నిర్మించారు.