అనుష్క శెట్టి గత కొంత కాలంగా ఆమె ఎంచుకుంటున్న చిత్రాలే చెబుతున్నాయి ఆమె అభిరుచి ఎలాంటిదో. పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉంటేనే ఆమె సినిమాలు ఒప్పుకుంటోంది. హీరో పక్కన ఆడిపాడే పాత్రలకు స్వీటీ ఎప్పుడో స్వస్తి పలికేసింది. గత కొంత కాలంగా ఆమె చేసిన సినిమాలు బాహుబలి, సైజ్ జీరో, భాగమతి, రుద్రమదేవి. వీటిని బట్టే చెప్పొచ్చు అనుష్క సినిమాల ఎంపిక గురించి.
తాజాగా అనుష్క చేస్తోన్న తాజా చిత్రం నిశ్శబ్దం. కొద్దిసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అనుష్క ఇందులో సాక్షి అనే మూగ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. సాక్షి ఒక ఆర్టిస్ట్. ఆమె కళ మాట్లాడుతుంది కానీ ఆమె మాట్లాడలేదు అంటూ అనుష్క పాత్ర గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు.
కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. నిశ్శబ్దం ఐదు భాషల్లో విడుదలవుతోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ లో సైలెన్స్ పేరుతో వస్తోంది ఈ చిత్రం. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.నిశ్శబ్దానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.