టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ప్రాజెక్ట్ `ఆర్సీ 15`. భారీ చిత్రాలకు దక్షిణాదిలో ఆద్యుడిగా నిలిచిన దర్శకుడు శంకర్. ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా కలిసి చేయాలని ప్రతీ హీరో, నటుడు కలలకు కంటుంటారు. అలాంటి శంకర్ డైరెక్షన్లో రామ్చరణ్ హీరోగా ఎవరూ ఊహించని విధంగా ప్రాజెక్ట్ని సెట్ చేశారు దిల్ రాజు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ 50వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూవీ ప్రకటించిన దగ్గరి నుంచి ఈ ప్రాజెక్ట్పై రోజుకో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
`ఆర్సీ 15`(రామ్చరణ్ 15వ చిత్రం) గా రానున్న ఈ మూవీ శంకర్కూ 15వ చిత్రమే కావడం విశేషం. ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్న ఓ హీరోయిన్గా నటించనుందని, ఆమెతో పాటు ఓ కొరియన్ నటి కూడా కీలక పాత్రలో కనిపించనుందని గత రెండు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. తాఆజగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆప్ డేట్ చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రానికి యంగ్ తరంగ్ అనిరుధ్ సంగీతం అందించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రజనీకాంత్, విజయ్, పవన్కల్యాణ్, అజిత్ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలకు అనిరుధ్ వర్క్ చేశారు. తనదైన శైలి సంగీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అతనే శంకర్, చరణ్ల చిత్రానికి సంగీతం అందించబోతున్నారని, అనిరుధ్ టాలెంట్ నచ్చి శంకర్ అవకాశం ఇస్తున్నారన్నది తాజా అప్డేట్. అయితే దీనిపై దిల్ రాజు మాత్రం ఇంత వరకు స్పందించలేదు.