ప్రముఖ హాస్య నటుడు అలీ నిర్మాతగా మారారు. కొత్తగా అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ని స్థాపించి `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి` చిత్రాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అలీతో పాటు నరేష్, మౌర్యాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్వీకృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి క్లాప్ నిచ్చారు. ఎస్. గోపాల్రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు.
అలీ మాట్లాడుతూ ` దర్శకుడు శ్రీపురం కిరణ్, నేను చెన్నైలో రూమ్మ్మేట్స్. మలయాళంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ మూవీ చేస్తున్నాం. మలయాళ బ్లాక్ బస్టర్ వికృతి ఆధారంగా ఈ మూవీ చేస్తున్నాం. ఈ కథ నచ్చి నరేష్గారిని ఈ మూవీ చూడమన్నాను. అయనకు నచ్చడంతో ఇద్దరం కలిసి ఈ మూవీ చేస్తున్నాం. పవిత్రా లోకేష్, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం.. ఇలా అంతా పేరున్న సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు` అని తెలిపారు.
దర్శకుడు శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ ` అలీగారు ప్రారంభించిన అలీవుడ్ లో తొలి సినిమా చేసే అవకాశం ఇవ్వడం ఆనందంగా వుంది. నరేష్గారు ఇందులో నటించడానికి అంగీకరించడం వల్ల ఈ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది` అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, జీవిత రాజశేఖర్, నరేష్, మౌర్యాని తదితరులు పాల్గొన్నారు.