అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా పాలన సాగుతోందన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల పాదయాత్రపై స్పందించిన ఆయన.. పాదయాత్ర పేరుతో జరుగుతున్న దండయాత్ర అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం జరుగుతున్న దండయాత్రను ప్రజలు గమనించాలని.. విశాఖను పరిపాలనా రాజధాని కాకుండా చేస్తున్న పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పికొడతారన్నారు. రాజధాని రైతుల మహాపాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
ఇవాళ మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర దుగ్గిరాల వరకు కొనసాగనుంది.
అంతేకాదు.. న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరతామని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే అమరావతి పేరిట చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ఉత్తరాంధ్ర ప్రజలంతా శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అనకాపల్లిలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు దుష్టచతుష్టయంతో కలిసి మూడు రాజధానులపై వాస్తవాలను అవాస్తవాలుగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అంతకుముందు ఆయన పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాజువాకలోని నడుపూరులో జగనన్న కాలని భూమిపూజలో పాల్గొన్నారు.