రామ్ గోపాల్వర్మ గత కొన్ని నెలలుగా వివాదాస్పద చిత్రాలకు కేంద్ర బిందువుగా మారారు. నిత్యం వివాదాస్పద అంశాలతో ట్విట్టర్లో రచ్చ చేస్తున్న రామ్ గోపాల్వర్మ ఏపీ ఎన్నికల నుంచి టీడీపీని, ఆ పార్టీ నాయకుల్ని ఇరుకున పెడుతూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్లోనూ విచిత్రమైన ఫొటోలతో ప్రచారం చేస్తున్న ఆయన తాజాగా కుల ప్రస్థావనతో తెరపైకి తీసుకొచ్చిన చిత్రం `కమ్మ రాజ్యంలో కడపరెడ్లు`. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్తో పాటు జనసేనాని పవర్స్టార్ పవన్కల్యాణ్ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు.
అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం కావడంతో కొంత మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో టైటిల్ మార్చాల్సిందేనని హైకోర్టు తీర్పునిచ్చింది. సెన్సార్ వారు పలు సన్నివేశాలు, పాత్రలపై అభ్యంతరాలు చెప్పడం, సెన్సార్ చేయడానికి నిరాకరించడంతో చిత్ర టైటిల్ని `అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు`గా మార్చిన రామ్ గోపాల్వర్మ మళ్లీ సెన్సార్కి పంపించారు. రివిజన్ కమిటీ సినిమాని పరిశీలించి బుధవారం సెన్సార్ సర్టిఫికెట్ జారీచేయడంతో వర్మతో పాటు చిత్ర వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఒక వేళ రివిజన్ కమిటి సెన్సార్కు నిరాకరిస్తే సినిమాను యూట్యూబ్లో అయినా రిలీజ్ చేయాలని వర్మ నిర్ణయించుకున్నట్టు ఇటీవల వార్తలు షికారు చేశాయి. అయితే తాజాగా వివాదం ముగిసి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంతో వర్మ వివాదాస్పద చిత్రానికి లైన్ క్లియర్ అయిపోయింది. వివాదాస్పద అంశాలతో, పాత్రలతో నింపేసిన ఈ చిత్రాన్ని వర్మ గురువారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తన సినిమాకు సెన్సార్ పూర్తయిందని, నా చిత్ర రిలీజ్ని ఆపాలనుకున్నవారికిది బ్యాడ్ న్యూస్. `అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు` సెన్సార్ అడ్డంకుల్ని అధిగమించి రిలీజ్ అవుతోంది. కొంత మంది కన్నింగ్ ఫెలోస్, జోకర్స్ రిలీజ్ని అడ్డుకోవాలని ప్రయత్నించవచ్చు అయితే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను మాత్రం అడ్డుకోలేరు` అని వర్మ కామెంట్ చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.