కరోనా వైరస్ బాలీవుడ్ సెలబ్రిటీలకు వణుకుపుట్టిస్తోంది. మహారాష్ట్రలో ప్రధానంగా ముంబైలో కరోనా విజృంభిస్తుండటంతో సెలబ్రిటీలు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా సెలబ్రిటీలకు కరోనా సోకుతుండటంతో మరింతగా భయపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ వార్తవిని బాలీవుడ్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. యావత్ భారతం కూడా భయపడింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న సెలబ్రిటీలని కూడా కరోనా విడిచిపెట్టడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇదిలా వుంటే అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యలు వున్నా అమితాబ్ కోలుకుంటున్నారని, అభిషేక్ కూడా కోలుకుంటున్నారని, మరో వారం పాటు ఆసుపత్రిలోనే వుండాలని డాక్టర్లు వెల్లడించారు. ఐశ్వర్యారాయ్, ఆధ్యాకు కూడా పాజిటివ్ అని తేలడంతో వారు ఇంటి పట్టునే వుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా బిగ్ బి ఏమాత్రం తన జోరుని తగ్గించలేదు. డైలీ ట్విట్టర్లో అప్డేట్స్ పెడుతూనే వున్నారు. బిగ్బీకి కరోనా సోకిందని తెలియగానే ఆయన త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రార్థించడం మొదలుపెట్టారు, మీ ప్రేమాభిమానాలతో తాను తడిసి ముద్దవుతున్నానని, అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.