కరోనా వైరస్ పాండమిక్ కారణంగా లాక్డౌన్ విధించడంతో థియేటర్లన్నీ మూసివేతకు గురైన విషయం తెలిసిందే. లాక్డౌన్ దెబ్బతో థియేటర్ల వ్యాపారం దేశ వ్యాప్తంగా దారుణంగా పడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే పతనావస్థకు చేరింది. గత ఎనిమిది నెలలుగా మూసివేసిన థియేటర్ల భవిష్యత్తు ఇప్పటికీ అగమ్యగోచరంగానే తయారైంది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు రీఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించినా థియేటర్లకు జనం రావడం అనుమానాంగానే వుంది.
ఈ నేపథ్యంలో చాలా థియేటర్లు శాశ్వతంగా మూసివేత వైపు అడుగులు వేస్తున్నాయి. హైదరాబాద్లో ఐదు సినిమా థియేటర్లు శాశ్వతంగా మూసివేయబడ్డాయి. కరోనా దెబ్బతో మూసివేసిన థియేటర్లు గెలాక్సీ (టోలిచౌకి), శ్రీ రామ (బహదూర్పురా), శాంతి (నారాయణగూడ), అంబా (మెహెదీపట్నం), శ్రీ మయూరి (కవాడిగూడ). ఈ ఐదు థియేటర్లలో నాలుగింటిని గోడౌన్లుగా మార్చి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ లీజుకు తీసుకుంది.
ఇక ఐదవ థీయేటర్ కమర్షియల్ కాంప్లెక్స్గా మారబోతోంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం.. అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు పుంజుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో సింగిల్ థియేటర్ల పతనం మొదలైంది. ప్రైమ్ వీడియో ఓటీటీతో థియేటర్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న అమెజాన్ తన ఇ కామర్స్ బిజినెస్ కోసం మూసివేయబడ్డ థియేటర్ లని గిడ్డంగులుగా మార్చుకుంటూ థియేటర్ యాజమాన్యాలని రక్షిస్తుండటం ఓ విధంగా సంతోషించే విషయమే అయినా థియేటర్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తుండటం మాత్రం హర్షించదగిన విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.