కరోనా వైరస్ ప్రబలడంతో లాక్డౌన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో అన్నిరంగాలన్నీ స్వచ్ఛందంగా మూసివేయాల్సి వచ్చింది. మూడు నెలల తరువాత నుంచి కేంద్రం అన్ లాక్ ప్రక్రియని మొదలుపెట్టింది. కీలక రంగాలకు ఊరటనిస్తూ తిరిగి కార్యకలాపాలు కొనసాగించవచ్చని ప్రకటించడం మొదలుపెట్టింది. అయితే అందులో సినిమా షూటింగ్లు పరిమిత మెంబర్స్తో చేసుకోవచ్చని వెల్లడించిన కేంద్రం థియేటర్లని తిరిగి తెరుచుకునే వెసులు బాటును మాత్రం ఇవ్వడం లేదు.
దీంతో రిలీజ్కు సిద్ధమైన క్రేజీ చిత్రాలు ఓటీటీ ప్లాట్ పామ్లని ఆశ్రయిస్తున్నాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని, సుధీర్బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `వి` కూడా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. థియేటర్లో మాత్రమే మా చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ గట్టి నిర్ణయం తీసుకున్న మేకర్స్ చివరికి అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన డీల్కు తలొగ్గాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి భారీ ఆఫర్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ చివరగా ఓ మెలిక పెట్టినట్టు తెలిసింది. తాము తీసుకున్న చిత్ర ప్రమోషన్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టే అమెజాన్ ప్రైమ్ `వి` సినిమా ప్రమోషన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుందట. సినిమా అగ్రిమెంట్ దశలోనే ఓ కండీషన్ పెట్టిందని, అది ఈ సినిమా ప్రచార బాధ్యతల్ని హీరో నాని చేపట్టాలని, పూర్తి భాధ్యతను నానినే తీసుకోవాలని కండీషన్ పెట్టారట. ఇప్పడది నానికి సంకటంగా మారినట్టు చెబుతున్నారు.