అల్లు అర్జున్ శుక్రవారం కొత్త ప్రాజెక్ట్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వసుధ ఆర్ట్స్తో కలిసి ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ నిర్మించనుంది. బన్నీ 21వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో వుంటుందని తెలిసింది. యువత రాజకీయాల్లోకి రావాలనే పాయింట్తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అంతే ఓకే కానీ వేణు శ్రీరామ్ సినిమా పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు `ఐకాన్ కనబడుటలేదు` పేరుతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అఫీషియల్గా చిత్ర బృందం ఈ చిత్రాన్ని 21వ సినిమాగా నిర్మిస్తున్నామంటూ ప్రకటించింది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ స్థానంలోకి సుకుమార్ `పుష్ప` ప్రాజెక్ట్ వచ్చి చేరింది. ఈ సినిమా తరువాత ఖచ్చితంగా `ఐకాన్` వుంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆ స్థానంలోకి కొరటాల శివ చిత్రం రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
దీనిపై ఆరాతీస్తే వేణు శ్రీరామ్ తో చేయాలనుకున్న `ఐకాన్ ` చిత్రాన్ని బన్నీ పక్కన పెట్టినట్టు తెలిసింది. నిర్మాత దిల్ రాజు కూడా బాలీవుడ్ ప్రాజెక్ట్లతో పాటు పవన్తో నిర్మిస్తున్న `వకీల్సాబ్` చిత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో `ఐకాన్` ని పక్కన పెట్టేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని నిజం చేస్తూ తాజాగా కొరటాల చిత్రాన్ని 21వ సినిమా ప్రకటించడంతో `ఐకాన్` ఇక ఆగిపోయినట్టే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.