స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ఆర్య, ఆర్య 2 వచ్చాయి. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. గతేడాదే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం జనవరిలో షూటింగ్ మొదలవ్వాలి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని డిలే చేస్తూ వచ్చారు. అయితే గత నెలలో సుకుమార్ ఫార్మాలిటీ కోసం కేరళ అడవులకు వెళ్లి బన్నీ లేకుండానే ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన విషయం తెల్సిందే.
ఇంకా షూటింగ్ మొదలుకాకపోవడంతో రకరకాల వార్తలు షికార్లు చేయడం మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ మార్చ్ లో కాదని, ఈ నెలలోనే అధికారికంగా మొదలవుతుందని తెలుస్తోంది. కేరళ అడవుల్లోనే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని బలంగా వినిపిస్తోంది. అలాగే ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈ టాలెంటెడ్ నటుడికి భారీ పారితోషికం ముట్టజెప్పినట్లు సమాచారం.
అలాగే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా అనసూయ కెరీర్ కీలక మలుపు తిరిగింది. ఇప్పుడు అదే సుకుమార్ మళ్ళీ అనసూయకు మరో క్రేజీ రోల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈసారి పూర్తి నెగటివ్ ఛాయలున్న పాత్రను చేయబోతోందిట రంగమ్మత్త. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిసున్న ఈ సినిమాను మొదట వచ్చే సంక్రాంతికి విడుదల చేద్దామని భావించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రం సంక్రాంతికి రానుండడంతో ఇప్పుడు మరో మంచి విడుదల తేదీ కోసం చూస్తున్నారు. వచ్చే సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అల్లు అర్జున్ ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు సుకుమార్ చిత్రంతో తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.