స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో ఇంకా రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఆదివారం కూడా ఈ చిత్ర వసూళ్లు అదిరిపోయాయి. ఇదే ఉత్సాహంతో అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా కోసం సమాయత్తమవుతున్నాడు. అలాగే తన తర్వాతి సినిమాల విషయంలో క్లారిటీ తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తెగ బిజీగా ఉన్న హీరోల్లో బన్నీ ఒకరు. సుకుమార్ సినిమా కాకుండా మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇదే క్రమంలో గత సంవత్సరం అల్లు అరవింద్, పరశురామ్ దర్శకుడిగా అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా సెట్ చేయిద్దామని ప్లాన్ చేసారు.
గీతా గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ తర్వాతి సినిమా విషయంలో చాలా తకరారు నడిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ హీరోగా సినిమా తీయాలని అరవింద్ భావించారు. అయితే కథ బాగున్నప్పటికీ ఎందుకో కాంబినేషన్ పరంగా సెట్ అవ్వలేదు. అటు మహేష్ ఇటు అల్లు అర్జున్ కూడా తర్వాతి సినిమాల విషయంలో బిజీ అయిపోయారు. పరశురామ్ కూడా నాగ చైతన్య హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే గీతా ఆర్ట్స్ తో చేయాల్సిన కమిట్మెంట్ అలాగే ఉంది.
ఇప్పట్లో అల్లు అర్జున్ ఫ్రీ అయ్యేలా లేడు కాబట్టి అల్లు అరవింద్ ఈ కథను విజయ్ దేవరకొండకు పంపించడం, తనకు తెగ నచ్చేయడం చకచకా జరిగిపోయాయి. విజయ్, పరశురామ్ కు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లు పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుంది. దీనికి ఒక సంవత్సరం సమయం పట్టే అవకాశాలున్నాయి. సో, 2021లో గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాంబో తిరిగి రిపీట్ కానుందన్నమాట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. గీతా ఆర్ట్స్ తో పాటు మరో బడా నిర్మాణ సంస్థ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం కానుంది.