కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం, సోషల్ డిస్టెన్సీని పాటించడం తప్ప మరో మార్గం లేదని భావించిన కేంద్రం 21 రోజుల పాటు యావత్ దేశాన్ని లాక్ డౌన్ చేసేశారు. దీంతో సామాన్య పౌరుల జీవితం అస్థవ్యస్థంగా మారింది. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధంలో తాము సైతం అంటూ సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు.
నితిన్, పవన్కల్యాణ్, ప్రభాస్, రామ్చరణ్, మహేష్బాబు, ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, కొరటాల శివ, దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, సి. అశ్వనీదత్, సాయితేజ్, నిర్మాత ఎస్. రాధాకృష్ణ వంటి వారంతా విరాళాలు ప్రకటించారు. ఇదే వరుసలో అల్లు అర్జున్ కూడా కోటి 25 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని మూడు రాష్ట్రాలకు అందజేయనున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు బన్నీకి కేరళలో అభిమానులున్న విషయం తెలిపిందే. అందులో బాగంగానే బన్నీ ఉభయ తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు, 50 లక్షలు, కేరళకు 25 లక్షలు అందించే అవకాశం వుందని తెలిసింది.
`నమస్తే నేను మీ అల్లు అర్జున్..కోవిడ్ 19 ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితుల్ని సృష్టిస్తోంది. ఆ మహమ్మారి మన రోజువారీ జీవితాల్ని మార్చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మన సైన్యం.. అలాగే ఎన్నో రంగాలకు చెందిన వారు తమ జీవితాలను పణంగా పెట్టి మన కోసం కష్టపడుతున్నారు. వారందరి నుంచి స్ఫూర్తి పొందిన నేను నా వంతు సాయంగా 1.25 కోట్లను ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ప్రకటిస్తున్నాను. ఈ మహమ్మారి నివారణకు ఉన్న ఏకైక మార్గం చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం` అని అల్లు అర్జున్ పేర్కోన్నారు.