ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ నుంచి మ్యాక్స్ ప్లేయర్, ఆల్ట్ బాలాజీ, జీ5 వరకు పలు ఓటీటీ ప్లాట్ ఫామ్లో ఇండియాలో పాగా వేశాయి. ఇందులో దేశీయ ఓటీటీలు ఆల్ట్ బాలాజీ, జీ5.. మిగతావి విదేశాలకు చెందినవి. ఇక దక్షిణాదిలో మాత్రం ఓటీటీ అనేది లేదు. ఈ రేసులో దూకుడుగా వచ్చిన తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. దని వెనకాల మైహోమ్ రామేశ్వరరావు, అల్లు అరవింద్ లాంటి బిగ్గీస్ వున్నా సగటు ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్ మాత్రం తక్కువే వుంది.
ఆ లోటుని తీర్చడం కోసం నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ప్రచారం మొదలుపెట్టిన ఆయన కంటెంట్ పరంగా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే క్రిష్, నందినిరెడ్డి లాంటి దర్శకులని స్క్రిప్ట్ పరిశీలన కోసం ఎంచుకున్న అల్లు అరవింద్ ప్రస్తుత టైమ్ని మరింత బాగా వాడుకునే ప్రయత్నంలో భాగంగా కంటెంట్ పరిశీలన కోసం వంశీ పైడిపల్లి, చంద్ర సిద్ధార్ధ, వి.ఎన్. ఆదిత్య వంటి దర్శకులతో ఓ టీమ్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
లాక్డౌన్ సమయంలోనూ పరిమిత క్రూతో పరిమిత బడ్జెట్తో కొత్త తరహా వెబ్ సిరీస్లని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు కొత్త కథలు కావాలని, అలా వచ్చిన కథల్లో ఎంత సత్తావుందో తేల్చి ఫైనల్ చేయడం కోసం ఈ టీమ్ ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే `ఆహా` ఓహో అనే రేంజ్లో ఆకట్టుకోవడం గ్యారెంటీ అంటున్నారు.