మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా సోకిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా వచ్చిందని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై సోమవారం స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `నాకు కరోనా వచ్చిందని చాలా చోట్ల వార్తలు వచ్చాయి. అవును నాకు కరోనా వచ్చిన మాట నిజమే.కానీ రెండు డోస్లు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా కరోనా వచ్చిందని రాస్తున్నారు. అది మాత్రం నిజం కాదు. నేను ఒకడోస్ మాత్రమే వేసుకున్నాను. అసలు విషయం ఏంటంటే మేం ముగ్గురం స్నేహితులం కలిసి ఊరెళ్లొచ్చాం. అప్పుడే కరోనా వచ్చింది. మా ముగ్గురిలో ఇద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం. నాకు మూడు రోజులు లైట్గా జ్వరం వచ్చి తగ్గింది.
అయితే వ్యాక్సిన్ తీసుకోని స్నేహితుడు మాత్రం హాస్పిటల్లో వున్నాడు. అతన్ని చూసిన తరువాత నాకు తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా మంచిది అయింది. దానికి నేనే నిదర్శనం. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా వస్తుందంట కదా అంటే వస్తుంది కానీ చాలా లైట్గా వచ్చి వెళ్లిపోతుంది. అందుకే తపకపకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. కొన్ని సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా వచ్చినా వచ్చి వెళ్లిపోతుందంతే కానీ ప్రాణహానీ వుండదు. నా స్నేహితుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. నేను వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా లైట్గానే వుంది. అందుకే తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి` అని తెలిపారు అల్లు అరవింద్.