నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ తరువాత కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన హీరో అల్లరి నరేష్.
ఒక దశలో రెండు మూడు షిప్టుల్లో పనిచేసి ఏడాదికి మూడు నుంచి నాలుగు చిత్రాల్ని రిలీజ్ అయ్యేలా శ్రమించిన అల్లరి నరేష్ గత కొంత కాలంగా తన మార్కు ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులకు అందించడంలో విఫలమౌతున్నారు. ఒకే తరహా కామెడీ, బోరుకొట్టించే పేరడీ సన్నివేశాల కారణంగా అందుకు నరేష్ చిత్రాలకు ఆదరణ తగ్గింది.
దీంతో కొంత విరామం తీఉకున్న ఆయన తనని తాను సరికొత్త పాత్రలో ప్రజెంట్ చేసుకుంటూ నటిస్తున్న తాజా చిత్రం `నాంది`. విజయ్ కనకమేడల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నరేష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నరేష్ ట్రల్ ఖైదీగా కనిపించబోతున్నారు. పాత్ర డిమాండ్ మేరకు పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో న్యూడ్గా కూడా నటించి సంచలనం సృష్టించారు నరేష్. తొలి టీజర్తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఇటీవలే ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చిత్ర బృందం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ మొదలుపెట్టింది. మూడు రోజుల పాటు చిత్రీకరణ సాగింది. మధ్యలో అర్థాంతరంగా షూటింగ్ ఆపేశారు. దీంతో ఈ చిత్ర టీమ్కు కరోనా సోకిందంటూ వార్తలు షికారు చేయడం మొదలైంది. ఈ వార్తలని చిత్ర బృందం తాజాగా ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని, బుధవారం కురిసిన వర్షం కారణంగానే షూటింగ్ ఆపేశామని స్పష్టం చేసింది. తమ చిత్రంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని వెల్లడించింది.