బాలీవుడ్ క్రేజీ లేడీ అలియాభట్ సోషల్ మీడియాపై ఫైర్ అయింది. ప్రజల్ని ఒక్కటి చేయాల్సిన సామాజిక మాధ్యమాలు వేరు చేస్తున్నాయని మండిపడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం తరువాత సోషల్ మీడియా వేదికగా అలియభట్ని నెటిజన్స్ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలియాభట్, హృతిక్ రోషన్లకు ప్రతిష్టాత్మక ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది.
దీంతో నెటిజన్స్ బాలీవుడ్ లో వున్న బంధు ప్రీతిపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోయడం మరింత తీవ్ర తరం చేశారు. దీంతో ఆగ్రహించిన అలియాభట్ సోషల్ మీడియాపై మండిపడింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో తనని సభ్యురాలిగా చేరమని ఆహ్వానం పంపించినందుకు వారికి ధన్యవాదాలని తెలిపింది. ఇండియాలోని నటులు, సాంకేతిక నిపుణుల్ని అకాడమీ గుర్తించడం శుభ పరిణామమని వెల్లడించింది.
సినిమా, వాటర్ ఒకే పోలికను కలిగి వుంటాయని, తర తమ,జాతి విభేదాలు హద్దులు అనేవి లేకుండా స్వేచ్ఛగా ప్రవహిస్తాయని పేర్కొంది. సినిమా పట్ల భిన్నమైన అభిప్రాయాలు వుండవచ్చు కానీ అది ఓ శక్తి వంతమైన మాధ్యమం అని తెలిపింది. ఇదే సందర్భంగా ప్రజల్ని ఒక్కటి చేసేందుకు పుట్టిన సోషల్ మీడియా ప్రస్తుతం వారిని వేరు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.