`సాహో` తరువాత యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణామూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం చిత్రకరణ పూర్తయింది. ఇటీవలే జార్జియాలో ఈ చిత్ర బృందం కీలక షెడ్యూల్ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది.
కరోనా కారణంగా షూటింగ్ని వాయదా వేశారు. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత ప్రభాస్ తో మరో పాన్ ఇండియా స్థాయి సినిమాకు మెగా ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. `మహానటి` చిత్రంతో విమర్శకులని సైతం ఆశ్చర్యపరిచిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రభాస్ 21వ చిత్రంగా తెరపైకి రాబోతున్న ఈ చిత్రం కోసం మేకర్స్ దాదాపు 400 కోట్లు ఖర్చు చేయబోతున్నారట.
`జగదేకవీరుడు అతిలోక సుందరి` తరహా సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ లేదా నవంబర్లో సెట్స్మీదికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్ దీపికని సంప్రదించారని, ఇందు కోసం ఆమె 15 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్టు తెలిసింది. తాజాగా ఆ స్థానంలో అలియాభట్ని ఫైనల్ చేయాలనుకుంటున్నారట. ఇందు కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా అశ్వనీదత్ వెనుకాడటం లేదని తెలిసింది. అలియాభట్ ప్రస్తుతం రామ్చరణ్కు జోడీగా `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే.