ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ సంపాదించుకోవాలని మన హీరోలు ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసారు. అయితే అనుకోకుండానే అల్లు అర్జున్ కు కేరళలో మంచి మార్కెట్ వచ్చింది. వరసపెట్టి తన డబ్బింగ్ సినిమాలు అక్కడ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ రేంజ్ అక్కడ బాగా పెరిగింది. ఫ్యాన్స్ కు తయారయ్యారు. అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని సంభోదిస్తుంటారు అక్కడ. మలయాళంలో ఒక మీడియం రేంజ్ హీరోకు ఉండే మార్కెట్ ను చాలా తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు బన్నీ. తను తెలుగులో చేసే ప్రతి సినిమా మలయాళంలో కూడా విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ మధ్య కేరళ వెళ్తే అక్కడ జన సందోహానికి బన్నీ కూడా ఆశ్చర్యపడ్డాడు. ఆ రేంజ్ లో అభిమానులు సందడి చేసారు. అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న అల వైకుంఠపురములో చిత్రానికి భీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని అగ్రసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, రెండూ కూడా సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఒకదాన్ని మించి మరొకటి మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ చిత్రానికి నాలుగు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెట్టాలన్న అల వైకుంఠపురములో టీమ్ స్ట్రాటజీ సూపర్ గా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి ఉన్నంత బజ్ తెలుగులో మరే సినిమాకి లేదంటే అతిశయోక్తి కాదు.
తెలుగులో ఇప్పటికే మచ్ అవైటెడ్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకున్న అల వైకుంఠపురములో ప్రమోషన్స్ లో మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఈ నెలలోనే చిత్రంలోని మూడో పాటను కూడా విడుదల చేస్తారట. అయితే దానికంటే ముందు అల వైకుంఠపురములో మలయాళ వెర్షన్ టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కాగా ఎటువంటి అప్డేట్ వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు అల వైకుంఠపురములో టీమ్ ఇలా స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిందన్నమాట. ఈ చిత్రాన్ని మలయాళంలో అంగు వైకుంఠపురతు పేరుతో విడుదల చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని సూపర్ డూపర్ హిట్ మెలోడీ సామజవరగమన మలయాళ వెర్షన్ ను ఈ నెల 10వ తారీఖున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు వెర్షన్ తో పాటే మలయాళ వెర్షన్ కూడా జనవరి 12 2020న విడుదలవుతుందని తెలిపారు. ఒకవైపు తెలుగే అనుకుంటే ఇప్పుడు మలయాళంలో కూడా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. కేవలం ఇక్కడ విడుదలైన పోస్టర్ కు టైటిల్ మార్చడం లాంటిది కాకుండా మలయాళ ప్రేక్షకుల కోసం కొత్త పోస్టర్ ను వదిలారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్, నవదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టబు ఈ చిత్రం ద్వారానే మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. థమన్ ఈ చిత్రానికి స్వరాలను అందిస్తున్న విషయం తెల్సిందే. చినబాబు, అల్లు అరవింద్ నిర్మాతలు.
On the occasion of our beloved Guruji, #Trivikram gari birthday, Presenting you #AnguVaikuntapurathu First Look!! Here’s another surprise, #Samajavaragamana Malayalam version will be out on 10th Nov. Stay Tuned.@alluarjun @hegdepooja @MusicThaman #Tabu #Jayaram @haarikahassine pic.twitter.com/tuGNCsPw9o
— Geetha Arts (@GeethaArts) November 7, 2019
Credit: Twitter