ప్రపంచ వ్యాప్తంగా క్రేజున్న క్రికెట్ తరువాత అత్యధికమంది ఆదరించే గేమ్ ఫుట్బాల్. ఈ ఆట ఇండియాలో ఓ దశలో స్వర్ణయుగాన్ని చూసింది. ఆ సమయంలో ఫుట్బాల్ ఆటకు వన్నెతెచ్చిన ఓ కోచ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం `మైదాన్`. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ యదార్థ కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని బోనీకపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `బధాయి హో` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు అమిత్ రవంద్రనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అజయ్ దేవ్గన్ లుక్ని గరువారం చిత్ర బృందం, అజయ్దేవ్గన్ రిలీజ్ చేశారు.
`మార్పు తీసుకురావడానికి ఒక్కడు చాలు` అనే స్లోగన్స్ ఆకట్టుకుంటున్నాయి. భారతీయ ఫుట్బాల్ ఆటకు స్వర్ణయుగంగా పేరున్న 1952- 1962 కాలంలో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కోల్కతా, లక్నో, ముంబై నగరాల్లో దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.