రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్చరణ్, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఫ్రడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల అజ్ఞాత జీవితం నేపథ్యంలో కంప్లీట్ పాంటసీ చిత్రంగా ఈ సినిమాని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. `బాహుబలి` తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు మించి సర్ప్రైజ్లతో దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ నటుల్ని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ అజయ్దేవగన్ టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఇందులో ఆయన పాత్ర బ్రిటీష్ ఇండియా పోలీస్ అధికారిగా కనిపిస్తారని, రామ్చరణ్, అజయ్దేవగన్ మధ్య వచ్చే సన్నివేశాలు రోమాంచితంగా వుంటాయని ప్రచారం జరుగుతోంది. తాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
ఈ చిత్రంలో కీలక అతిథి పాత్రలో నటిస్తున్న అజయ్దేవ్గన్ ఎలాంటి పారితోషికం ఆశించకుండా ఈ సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ రెమ్యునరేషన్ సాధారణంగా 30 నుంచి 35 కోట్లు. అంత మొత్తం అతిథి పాత్రకు అందించాలని నిర్మాత దానయ్య ముందుకు వచ్చినా అజయ్ మాత్రం సున్నితంగా తిరస్కరించారట. ఎలాంటి పారితోషికం ఆశించకుండానే కేవలం రాజమౌళి కోసం ఈ సినిమా చేస్తున్నట్టు చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.