వెబ్ సిరీస్లకి, డిజిటల్ ప్లాట్ ఫామ్లకి జనాలు బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. లాక్డౌన్ కారణంగా డిజిల్ ప్లాట్ ఫామ్లకు వ్యూవర్స్ తాకిడి మరింతగా పెరిగింది. థియేటర్లు మూసేయడంతో ఇంటి పట్టునే వుంటున్న వారంతా కాలక్షేపం కోసం.. వినోదం కోసం డిజిటల్ ఓటీటీలని ఆశ్రయిస్తున్నారు. ఈ కోవలో తెలుగు వారిని ఎట్రాక్ట్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మై హోమ్ రామేశ్వరరావు సంయుక్తంగా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ని ప్రారంభించారు.
దక్షిణాదిలోనే మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ ఫామ్గా రంగంలోకి దిగిన `ఆహా` అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్లకు ధీటుగా వెబ్ సిరీస్లతో పాటు సినిమాలని అందించడం మొదలుపెట్టింది. ఈ విషయంలో తాజాగా దూకుడు పెంచింది. ఇప్పటికే తెలుగు వారికి అత్యంత చేరువైన ఈ ఓటీటీ రీసెంట్గా సరికొత్త రికార్డుని సాధించింది. దుల్కర్ సల్మాన్, రీతూవర్మ నటించిన `కనులు కనులను దోచాయంటే` ఓటీటీలో రిలీజ్ చేసింది. విడుదల చేసిన వారం రోజులకే 10 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ను క్రాస్ చేసింది.
ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ అప్పటి నుంచి అత్యధికంగా వీక్షకులను ఆకట్టుకుంటూ తెలుగు ఎంటర్టైన్మెంట్ పరంగా ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. దీంతో కొత్త కంటెంట్ కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. నేచురల్ స్టార్ నాని నటించిన `కృష్టార్జున యుద్ధం` చిత్రాన్ని మే 8న విడుదల చేసిన `ఆహా` అదే ఊపుతో శ్రీవిష్ణు నటించిన `మెంటల్ మదిలో` చిత్రాన్ని ఈ నెల 15న రిలీజ్ చేసింది. అలాగే మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన `ఆహా` ఒరిజినల్ `రన్`ను ఈ నెల 29న వ్యూవర్స్కి అందుబాటులోకి తీసుకురాబోతోంది.
నవదీప్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్రెడ్డి దీన్ని నిర్మించారు. `ఆహా`లో బ్లాక్ బస్టర్ చిత్రాలు, క్లాసిక్ చిత్రాలు, వెబ్ సిరీస్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు `ఆహా` మరింత దర్గరవుతోంది.